జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కీలక తీర్మానం

-

టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ నేడు నోవోటెల్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో అటు జనసేన ఇటు టీడీపీ తరఫున మెుత్తం 13 మంది సభ్యులు పాల్గొన్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని సమన్వయ కమిటీ సభ్యులు, టీడీపీ నుంచి నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.

నేటి సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై చర్చించి తీర్మానం చేశామని వెల్లడించారు. జనసేన, టీడీపీ రైతులకు అండగా నిలుస్తాయని, రాష్ట్రంలోని కరవు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడాలని తీర్మానం చేసినట్టు వివరించారు.

కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దేవుడి దయతో అంతా బాగుందని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధం అని విమర్శించారు. ఖరీఫ్ సమయంలో 32.42 శాతం వర్షపాతం నమోదు కావడం, లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందనేది వాస్తవం అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 25 లక్షల ఎకరాల్లో కనీసం సాగు కూడా చేయలేదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరవుతో పాటు పాలక పక్షం నిర్లక్ష్య ధోరణులతోనూ రైతాంగం నష్టపోయిందని అన్నారు.

సకాలంలో సాగు నీరు ఇవ్వకపోవడంతో పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయని, సాగు నీటి విడుదలలో, కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉందని నాదెండ్ల పేర్కొన్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలను గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version