కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె పై మండిపడుతున్న ఉత్తర కొరియా ప్రజలు

-

ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టడం జరిగింది. ఈ క్షిపణి పరీక్షలకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో పాటు అతని కుమార్తె కిమ్ జు యే కూడా చూడడానికి వచ్చారు. అయితే, కిమ్ కుమార్తె పుష్టిగా, ఆరోగ్యంగా, ఖరీదైన దుస్తులు ధరించి విలాసవంతంగా కనిపించడంపై ఉత్తర కొరియా ప్రజలు తీవ్రంగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. “బాగా తిని బలిసింది” అంటూ మండిపడ్డారు ప్రజలు. ఆ అమ్మాయి బాగా తింటుందని తమకందరికీ తెలుసని, ఫ్యాన్సీ డ్రెస్సులు ధరించి టీవీల్లో కనిపిస్తుందని, ఎంతో లగ్జరీగా జీవిస్తుందని ఓ ఉత్తర కొరియా వాసి తెలిపాడు. ఇష్టం వచ్చినట్టు తింటుందేమో… ఆమె ముఖం గుండ్రంగా, బొద్దుగా చందమామలా కనిపిస్తుంటుంది అని తమ ప్రజలు అనుకుంటుంటారని ఆ వ్యక్తి తన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ దేశంలో ప్రజలు తినడానికి కూడా సరిగా తిండిలేని పరిస్థితుల్లో చాలామంది బుగ్గలు పీల్చుకుని పోయి దవడలకు అంటుకుని ఉంటాయని, కానీ, కిమ్ కుమార్తె అందుకు భిన్నంగా ఉందని అన్నాడు ఆయన. దేశ రాజధానిలో మిగతా పిల్లలు మూడు పూటలా భోజనం దొరక్క కష్టాలు పడుతుంటే, కిమ్ కుమార్తె చూడండి ఎలా ఉందో అని మరో వ్యక్తి మండిపడ్డాడు. ఇలాంటి పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నాడు. కాగా, కిమ్ సంతానం గురించి ఉత్తర కొరియా అధికారిక మీడియా ఎప్పుడూ ప్రస్తావించదు. అయితే, పొరుగునే ఉన్న దక్షిణ కొరియా నిఘా సంస్థ మాత్రం కిమ్ కు ముగ్గురు పిల్లలని… వారు 13, 10, 6 ఏళ్ల వయసు గలవారని చెబుతుంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version