ఎన్టీఆర్‌తో పోటీ కాదు..చిరంజీవిని దాటలేరా?

-

మళ్ళీ చాలారోజుల తర్వాత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కనిపించారు. అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపిస్తూ..సినిమాల్లో బిజీగా ఉన్న పవన్..దసరా నుంచి బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే క్రమంలో పవన్..పార్టీ నేతలతో సమావేశమై..బస్సు యాత్ర గురించి మాట్లాడరు. బస్సు యాత్రని మొదట అక్టోబర్ 5 నుంచి మొదలుపెట్టాలని అనుకున్నారు.

అయితే ఇది ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంలోనే జరిగిందని, ఇప్పుడు ముందస్తు లేదని కథనాలు వస్తున్న నేపథ్యంలో పవన్ బస్సు యాత్ర వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నారని తెలిసింది. ఈ దసరాకు మాత్రం యాత్ర లేదని, త్వరలోనే ఉంటుందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఈ సారి వైసీపీ గెలవదని, ఆ పార్టీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని సర్వేల రిపోర్టు అంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో జనసేన ఎన్ని గెలుస్తుందనేది చెప్పలేదు. అలాగే టీడీపీకి సీట్లు ఇవ్వలేదు. అంటే టీడీపీ-జనసేన కలిసి పనిచేయనున్నాయని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అర్ధమవుతుంది.

అయితే జనసేన పార్టీ పెట్టి 8 ఏళ్ళు దాటేసింది..కానీ ఇంతవరకు పార్టీ బలపడలేదు. గత ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. ఇప్పటికీ ఆ పార్టీకి పెద్ద బలం పెరిగినట్లు కనిపించడం లేదు. దీంతో జనసేన ఫ్యూచర్‌పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ..తన ప్రాణం ఉన్నంతవరకు జనసేన ఉంటుందని చెప్పుకొచ్చారు.

1982లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని, ఆయనతో మనం పోటీ పడలేమని, అప్పటి పరిస్తితులు వేరు అని చెప్పుకొచ్చారు. అయితే అధికారం గురించి పక్కన పెడితే…కనీసం కొన్ని సీట్లు గెలుచుకునే సత్తా అయిన పార్టీకి ఉండాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో జనసేన సింగిల్ గా పోటీ చేస్తే..కేవలం ఐదారు సీట్లు మాత్రమే గెలుచుకునేలా ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి 2009లో 18 సీట్లు గెలుచుకున్నారు. ఆ స్థాయిలో కూడా జనసేన బలోపేతం కాలేదు. కాబట్టి ఎన్టీఆర్‌ని పక్కన పెడితే కనీసం చిరంజీవిని దాటాలి కదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news