విశాఖలో ట్రైయాంగిల్ ఫైట్..ఎత్తుకు పై ఎత్తు..!

-

రాజకీయ పార్టీలంటే రాజకీయాలే చేస్తాయి..పైకి ప్రజల మేలు కోసం ఏదో చేస్తున్నామని చూపించి..ప్రజల మద్ధతు పొందడానికి ఊహించని ఎత్తుగడలతో ముందుకెళ్తాయి. ఏపీలోని ప్రధాన పార్టీలు మొదట నుంచి అలాగే పనిచేస్తున్నాయి. ఎలాంటి రాజకీయం చేస్తే ఎన్ని ఓట్లు పడతాయనే కాన్సెప్ట్‌తో ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.

అయితే దేశంలో ఎక్కడా కూడా రాజధాని అంశంపై రాజకీయం జరగలేదు. కానీ ఏపీలో రాజధాని విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..అమరావతి రాజధానిగా పెట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారు. చివరికి అమరావతి రాజధానిగా లేదు..ఇటు మూడు రాజధానులు అమలు కాలేదు. ఇక ఈ రాజధాని అంశంపై వైసీపీ-టీడీపీలు రాజకీయాన్ని రగిల్చి..లబ్ది పొందడానికి చూస్తున్నాయి.

అసలు అధికారంలో ఉన్న వైసీపీ..విశాఖ రాజధాని అంటూ పోరాటం మొదలుపెట్టింది. అంటే ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ లేపి..అక్కడ టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్ అని క్లియర్‌గా అర్ధమవుతుంది. అందుకే విశాఖ వేదికగా విశాఖ గర్జన చేస్తున్నారు. వైసీపీకి కౌంటరుగా సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో టీడీపీ విశాఖలో కార్యక్రమం చేస్తుంది. వైసీపీ ఎత్తులని తిప్పికొట్టి, ఉత్తరాంధ్రలో తమ బలం తగ్గకుండా చూసుకోవాలనే కాన్సెప్ట్‌తో టీడీపీ రాజకీయం చేస్తుంది.

ఈ రెండు పార్టీలే కాదు..జనసేన సైతం ఈ రాజధాని పోరులో రేసులోకి వచ్చింది. పవన్ కల్యాణ్ సైతం విశాఖ వేదికగా జనవాణి కార్యక్రమం పెడుతున్నారు. ఇలా మూడు పార్టీలు ఒకే రోజు విశాఖ వేదికగా రాజకీయ క్రీడ ఆడనున్నాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా విశాఖలో ట్రైయాంగిల్ ఫైట్ షురూ అయింది. మరి ఈ రాజకీయ క్రీడలో ప్రజలు ఎటు వైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలు ఆడే నాటకాలు అర్ధం చేసుకుని..ఈ ప్రాంతాల మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news