ఆదిపురుష్​ టీజర్ ఈవెంట్​లో నడవలేని స్థితిలో ప్రభాస్? ఆందోళనలో ఫ్యాన్స్!

-

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దీన్ని తెరకెక్కించారు. కృతిసనన్‌ కథానాయిక. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో విడుదల చేశారు. గ్రాండ్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ని చూసిన ఆయన అభిమానులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్‌కి ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్‌.. నడవడానికి చాలా ఇబ్బంది పడ్డట్లు పలు చోట్ల కనిపించింది. కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డట్లు కనిపించారు. ఈ క్రమంలో ప్రభాస్‌ మెట్లు దిగేందుకు దర్శకుడు ఓం రౌత్‌, కృతి సనన్‌ సాయం తీసుకున్నారు. వారి చేతులు పట్టుకుని మెట్లు దిగడం, చెప్పులు వేసుకునే సందర్భంలో కూడా వారి సాయం తీసుకోవడం చేశారు. ఈ వీడియోలు చూసిన అభిమానులు.. ప్రభాస్‌కు ఏమైంది.. ఏదైనా ప్రమాదం జరిగిందా అని ఆందోళనకు గురవుతున్నారు.

చాలా రోజుల క్రితం ప్రభాస్‌కు మోకాలికి సర్జరీ జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే సర్జరీ తర్వాత ప్రభాస్‌ తగినంత రెస్ట్‌ తీసుకోలేదని.. ఆ నొప్పి మళ్లీ తిరగబెట్టిందని.. అందుకే ఇలా ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. ఇంత నొప్పిని భరిస్తూ.. కూడా షూటింగుల్లో పాల్గొంటున్నారని.. ప్రభాస్‌ డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరి కొందరు అభిమానులు మాత్రం ప్రభాస్‌ పరిస్థితికి జక్కన్నే కారణమని విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్‌ ఇప్పటికైనా షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చి.. రెస్ట్‌ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. కానీ ప్రభాస్ వరుస సినిమాలతో బిజిబిజిగా గడుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version