అప్పులు ఇవ్వడమెమో గానీ అప్పు తీర్చడం కొంచెం ఆలస్యమైతే చాలు రికవరీ ఏజెంట్లను పెట్టి లోన్ తీసుకున్న వారు ఊసురు తీసుకున్నా డబ్బు రాబట్టేందుకు పూనుకుంటున్నారు. అప్పు ఇచ్చిన బ్యాంక్ల కంటే తామ సొమ్మే తీసుకున్నంతగా రికవరీ ఏజెంట్లు రెచ్చిపోయి రుణగ్రహీత పాలిట యమకింకరులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు కొవిడ్ లాక్డౌన్ తరువాత అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ చేసి వేధించడం, తప్పుడు మాటలు మాట్లాడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రికవరీ ఏజెంట్లకు హితవు పలికారు. వేళకాని వేళల్లో, కొన్నిసార్లు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రివకరీ ఏజెంట్లు ఫోన్ చేయడంపైనా, అభ్యంతరకర భాష మాట్లాడడంపైనా తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు.
ఇలాంటి చర్యలతో ఆయా ఆర్థిక సంస్థలు తమ మనుగడకు తామే ముప్పు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని స్పష్టం చేశారు శక్తికాంత దాస్. రికవరీ ఏజెంట్ల ఆగడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఫిర్యాదులు ఎదుర్కొనే ఆయా ఆర్థిక సంస్థలను సంబంధిత న్యాయ ప్రాధికార సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి విచారణ చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. రికవరీ ఏజెంట్లపై తమకు అందే ఫిర్యాదులను న్యాయ ప్రాధికార సంస్థలకు బదలాయిస్తామని తెలిపారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని, కాబట్టి ఈ తరహా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నామని వెల్లడించారు శక్తికాంత దాస్.