తమిళనాడు పసుపు బోర్డు వ్యవహారం తెలంగాణ బీజేపీని ఇరుకున పడేసిందా ?

-

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు వివాదం అగ్గిరాజేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన పసుపు బోర్డు హామీతో తెలంగాణ బీజేపీ ఇరుకునపడింది. దీనిపై నిరసనలకు దిగితున్న రైతులు ఎంపీ అరవింద్ పై మండిపడుతున్నారు. మరోవైపు షర్మిల కూడా పసుపుబోర్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు వివాదం మళ్లీ మంటపుట్టిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని రైతులు రోడ్డెక్కుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, 15 వేల మద్దతు ధర ప్రకటిస్తామని బీజేపీ హామీ ఇవ్వడం తెలంగాణ పసుపు రైతులకు ఆగ్రహం తెప్పించింది. నిరసనగా అర్మూర్‌ పట్టణ కేంద్రంలో తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టో ప్రతులను పసుపు రైతులు దహనం చేశారు.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని చెప్పిన కేంద్రం ఇప్పుడు తమిళనాడులో ఎలా ఏర్పాటు చేస్తారని పసుపు రైతులు మండిపడుతున్నారు. తమిళనాడు బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జిల్లాలో పసుపు రైతులకు ఆశించిన స్థాయి కంటే కేంద్రం ఎక్కువే చేసిందంటున్నారు. పసుపు రైతులకు మద్దతు ధరకు మించి రేటు ఇస్తున్నామన్నారు. మరోవైపు దూకుడు పెంచిన వైఎస్ షర్మిల నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. పసుపు బోర్డును ఇక్కడ ఏర్పాటు చేస్తానంటూ ఎవరో బాండ్ పేపర్ ఇచ్చారట..మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేశారట అంటూ ధ్వజమెత్తారు.

మొత్తానికి తమిళనాడులో పసుపుబోర్డు ప్రకటన తెలంగాణ బీజేపీని ఇరుకున పెట్టింది. పసుపు బోర్డు పై ఆశలు వదులుకున్న ఇందూరు రైతులను తమిళనాడు ఎన్నికలు తట్టి లేపినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news