TSRTC: ఆగస్టు 15న పుడితే.. 12 ఏళ్ల వరకు ఫ్రీ జర్నీ

-

‘అజాదీ కా అమృతోత్సవ్‌’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది.

టీ-24 బస్‌ టికెటును ఆ రోజున రూ.75(సాధారణ రోజుల్లో రూ.120)కే విక్రయిస్తామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ‘‘మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయగీతాన్ని ఆలపిస్తాం. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులంతా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలి’’ అని కోరారు.

మరికొన్ని కానుకలు ఇలా..

  • తితిదే ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు.
  •  ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్‌ 75 కిలోమీటర్ల వరకు ఉచిత రవాణా.
  •  టాప్‌-75 ప్రయాణికులకు ఒక ట్రిప్‌ టికెటు ఉచితం.
  • శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్‌ ఎయిర్‌ పోర్ట్‌ సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే చాలు.
  •  75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు.
  • 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్ష ప్యాకేజీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version