కాపురానికి వెళ్లనన్న నవవధువు.. రోకలిబండతో కొట్టి చంపిన తండ్రి..!!

-

పెళ్లై నెల రోజులు కూడా కాలేదు. పుట్టింటికి వచ్చిన తన కూతురుని ఓ తండ్రి అతి కిరాతకంగా చంపాడు. అడ్డు వచ్చిందని తన భార్యను కూడా చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

సరస్వతి-కళమ్మ

మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున భార్య కళమ్మ, కూతురు సరస్వతిని రోకలిబండతో కొట్టి చంపాడు. సరస్వతికి ఈ నెల 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. 15 రోజుల తర్వాత సరస్వతి పుట్టింటికి వచ్చింది. తిరిగి కాపురానికి వెళ్లనని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కృష్ణయ్య కాపురానికి వెళ్లాలని చెప్పాడు. తల్లి కళమ్మ కూతురికి అండగా నిలిచింది. దీంతో ఇంట్లో వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆగ్రహానికి లోనైన కృష్ణయ్య తల్లీకూతురుని రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత తానూ విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హుటాహుటిగా అక్కడికి చేరుకున్న బంధువులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే తల్లీకూతురు మరణించగా.. కృష్ణయ్య చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version