కొవిడ్‌ తర్వాత టెక్‌ కంపెనీలకు ఏమైంది..ఎందుకు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నాయి..?

-

చాలామందికి జీవితం బిఫోర్‌ కొవిడ్‌..ఆఫ్టర్‌ కొవిడ్‌ అన్నట్లు అయిపోయింది. కొంతమంది కొవిడ్‌ వచ్చాక సెటిల్‌ అయితే.. కొంతమందికి మాత్రం కరోనా తగ్గాక చుక్కలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలో గత సంవత్సరం జరిగినన్నీ రిక్రూట్‌మెంట్స్‌ జరగడం లేదు. పైగా ఉన్నవాళ్లను చెప్పాపెట్టకుండా తీసేస్తున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల టెక్ దిగ్గజాలు ఖర్చులు తగ్గించుకునేందుకు తమ నియామక ప్రణాళికలను ఆపేయడంతో పాటు సిబ్బందిని తొలగిస్తున్నాయి. కరోనా తర్వాత మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రెడీ అయ్యాయి. ట్విట్టర్వంటి సంస్థలు ఆల్రెడీ భారీగా ఉద్యోగులను తొలగించాయి. కోవిడ్ తరువాత, ఏ కంపెనీలు ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించాయి, లేఆఫ్స్ ఇవ్వాలని నిర్ణయించిన సంస్థలేవో చూద్దామా..!

మెటా

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తమ సిబ్బందిలోని సుమారు 13 శాతం వర్క్‌ఫోర్స్‌ని తగ్గించాలని నిర్ణయించింది. అంటే 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కంపెనీ తీసేయనుంది. ఆదాయాలు రాకపోవడం.. రాబడి తగ్గుదల వల్ల మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా లేఆఫ్స్‌ ఉంటాయని తెలిపింది. 2004లో ఫేస్‌బుక్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీ ఉద్యోగుల తొలగింపులు ఎన్నడూ జరగలేదు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు నియామక ప్రక్రియను కూడా ఆపేస్తున్నట్లు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ రీసెంట్‌గా ప్రకటించారు.

ట్విట్టర్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే సీఈఓ పరాగ్ అగర్వాల్, CFO నెడ్ సెగల్, న్యాయ వ్యవహారాలు, పాలసీ చీఫ్ విజయ గద్దెను తొలగించారు. 7,500 మంది వర్క్‌ఫోర్స్‌లో దాదాపు సగం మంది సిబ్బందిని తొలగించారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్ బృందాల నుంచి 90 శాతం భారత ఉద్యోగులు కూడా మస్క్ వచ్చాకే జాబ్ కోల్పోయారు.

మైక్రోసాఫ్ట్

పీసీ అమ్మకాలు భారీగా తగ్గడంతో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ తన వర్క్‌ఫోర్స్‌ని తగ్గించే పనిలో పడింది. ఈ టెక్ కంపెనీ జులైలో తన ఉద్యోగులలో 1 శాతం మందిని తొలగించింది. గత నెలలో కంపెనీ తన సిబ్బందిని మరింత తగ్గించుకోవలసి వచ్చింది. దీనికి ముఖ్య కారణం మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ విభాగంలో మందగమనం ఏర్పడటమే.

బైజూస్‌

ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌ దాదాపు 2,500 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. తమ కంపెనీలో ఒకే రోల్ చేపట్టే ఉద్యోగులు డబుల్ ఉన్నారని.. వారితో తమకు అవసరం లేదన్నట్లు కంపెనీ లేఆఫ్స్‌ ప్రకటించింది.

అన్‌అకాడమీ

ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీ ఖర్చులను తగ్గించుకోవడానికి… లాభదాయకతను పెంచడానికి 350 మంది ఉద్యోగులను లేదా మొత్తం 3,500 మంది ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించింది. ఏప్రిల్‌లో కూడా లాభదాయకతపై దృష్టి పెట్టడానికి.. ఖర్చులను తగ్గించడానికి అనాకాడెమీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. రెండేళ్లలో పబ్లిక్‌గా వెళ్లాలనే లక్ష్యంతో అన్‌అకాడమీ వ్యవస్థాపకులు ఉద్యోగుల జీతంలో కోత విధించారు.
ఇలా టెక్‌ కంపెనీస్‌ అన్నీ లాభాల రాక..ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం లేదా..తీసేయడం చేస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version