డీఎస్సీ రిజల్ట్స్ ఎప్పుడిస్తారు.. ఆర్ఎస్‌పీ ట్వీట్ వైరల్

-

వారంలో డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పి నెలలు గడుస్తోందని, ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నేత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.సెప్టెంబర్ 5 వరకే నియామకాలు చేపడతామని చెప్పారని, అక్టోబర్ నెల రావొస్తుందంటూ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద డీఎస్సీ పరీక్షలను జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ (సీబీటీ)లో నిర్వహించిందని గుర్తుచేశారు. చాలా మంది అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని వేడుకున్నా ప్రభుత్వం టీచర్ల కొరత ఉందని హడావుడిగా నిర్వహించిందన్నారు.

ఆన్లైన్‌లో పరీక్ష నిర్వహించాక నియామకాల భర్తీ ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించారు? రిజల్ట్స్ త్వరగా ప్రకటించి, జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి,నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల టీచర్లకే 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వీళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.హైడ్రా పేరుతో అందరి దృష్టి మళ్లించి తర్వాత వచ్చే ఏడాది నియామక పత్రాలు ఇద్దామని కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.అసలు విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరు? ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు? విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version