సైనిక దుస్తుల్లో మోదీ.. లడఖ్‌లో ఆకస్మిక పర్యటన..!

-

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం లడఖ్‌ లోని సరిహద్దులకు వెళ్లారు. ప్రధాని షెడ్యూల్‌ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తుండగా, ఆయన వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. వీరు ఇరువురూ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు లడఖ్‌ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. తొలుత ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం 10.00 గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. సైనికులతో సమావేశమయ్యారు.

ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ జవాన్లు ఇందులో పాల్గొన్నారు. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో సింధు నది జన్మస్థానం వద్ద ఈ సమావేశం జరుగుతోంది. జూన్ 15న చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధాని మోడి పరామర్శించనున్నారు. కాగా ప్రధాని ఈ పర్యటనలో సైనిక దుస్తుల్లో కనిపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. కరోనా భయాలను పక్కనబెట్టి, జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే, మోడి కూడా వారితో కలిసి భారతమాతకు జైకొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news