సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని

-

సికింద్రాబాద్ పరిధి నల్లగుట్ట లోని ఓ షాపింగ్ మాల్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాపింగ్ మాల్ మొత్తానికి విస్తరించడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అంతేకాక మంటలు పక్క భవనానికి కూడా అంటుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

గత మూడు గంటలుగా మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మొదటి అంతస్తులో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తులను స్కై లిఫ్ట్ సహాయంతో సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం పై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని భవనంలో చిక్కుకున్న చాలామందిని కాపాడినట్లు తెలిపారు. అయితే బిల్డింగ్ లో ఇంకో ఇద్దరు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపడుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version