టీఆర్ఎస్‌ను ముంచనున్న ‘బీటీ’ బ్యాచ్?

-

తెలంగాణని సాధించిన పార్టీగా ఇంతకాలం తిరుగులేని పొజిషన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి(టీఆర్ఎస్) గడ్డు కాలం మొదలైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అదే ప్రజల ఆశలని నెరవేర్చడంలో కాస్త ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్‌కు ఇప్పుడు వ్యతిరేక గాలులు వీయడం మొదలైందని చెప్పొచ్చు. అయితే వ్యతిరేకత రావడానికి చాలా అంశాలు ఉన్నాయి…కానీ మెయిన్‌గా మాత్రం ఒక అంశం టీఆర్ఎస్‌ని ఇబ్బంది పెడుతుందనే చెప్పొచ్చు. అది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమ కారులకు అన్యాయం చేస్తూ, ఉద్యమం చేయని వారిని అందలం ఎక్కించడమే టీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్న మేర మాత్రం న్యాయం జరగలేదు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారిని సైడ్ చేశారో అప్పటినుంచే టీఆర్ఎస్ పార్టీ రాజకీయం అర్ధమైపోయింది. ఒక కోదండరాం మాత్రమే కాదు…అనేక మంది ఉద్యమకారులని టీఆర్ఎస్ పక్కనబెట్టేసింది.

పైగా ఉద్యమ కాలంలో వేరే పార్టీల్లో ఉంటూ, ఉద్యమానికి వ్యతిరేకంగా, ఉద్యమకారులకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి కేసీఆర్ పెద్ద పీఠ వేశారు. అలా చాలామంది నేతలు వరుసపెట్టి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. పైగా ‘బంగారు తెలంగాణ’ కోసం తాము టీఆర్ఎస్‌లో చేరుతున్నామని చెప్పి వచ్చారు. ఇటు కేసీఆర్ కూడా రాజకీయంగా బలపడేందుకు అలాంటి నాయకులని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు.

కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఎర్రబెల్లి దయాకర్, తలసాని, తుమ్మల, మల్లారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే బీటీ బ్యాచ్ పెద్దగానే ఉంది. ఈ బ్యాచ్‌ని అందలం ఎక్కించి ఎప్పటికప్పుడు కేసీఆర్ ఉద్యమకారులని సైడ్ చేస్తూ వచ్చారు. విజయశాంతి, ఈటల రాజేందర్ లాంటి వారు కూడా బయటకొచ్చేశారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు విఠల్ లాంటి ఉద్యమకారులు కూడా టీఆర్ఎస్‌కు దూరమవుతున్నారు. అంటే ఉద్యమ నేతలంతా టీఆర్ఎస్‌కు దూరమవుతున్నారు. అందుకే ప్రజలు సైతం టీఆర్ఎస్‌ని దూరం పెట్టే పనిలో ఉన్నారు. మొత్తానికైతే బీటీ బ్యాచ్ వల్ల టీఆర్ఎస్ మునిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news