కొనుగోలు కేసులో కొత్త గేమ్ స్టార్ట్..!

-

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతరావు, గువ్వల బాలరాజులని బీజేపీలోకి తీసుకురావడానికి..ఒక్కొకరికి 100 కోట్ల ఆఫర్ చేసినట్లు ఆడియోలు, వీడియోలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు..నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజులని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే వీరిని విచారించిన పోలీసులు..మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నిక ముగిశాకే అసలు విచారణ జోరు అందుకుంటుంది. రేపటితో మునుగోడు ఉపఎన్నిక ముగియనుండటంతో..ఆ తర్వాత రోజు నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన విచారణ ముమ్మరం కానుంది. ఈ కేసులో సంబంధాలు ఉన్నవారిని విచారించడానికి పోలీసులు రెడీ అయ్యారు. బీజేపీ నేతలు, సానుభూతిపరులు టార్గెట్‌గానే కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్లనుందని తెలుస్తోంది.

అదే సమయంలో బీజేపీ కూడా టీఆర్ఎస్‌పై కౌంటర్ ఎటాక్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కొనుగోలుతో తమకు సంబంధం లేదని, అలాగే కేసీఆర్..2014 నుంచి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఇష్టారాజ్యంగా కొనుగోలు చేశారని, ఇప్పుడు నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే అని ఫైర్ అవుతున్నారు. ఈ కేసు విషయంలో పరోక్షంగా టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతతుంది.

ఇదే క్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి..ఫోన్ వాయిస్ రికార్డులు చేయడం, అవి బయటకు వదలడంపై ఓ జర్నలిస్ట్ కోర్టుకెక్కారు. ప్రజా జీవితానికి భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తున్నారని, దీనిపై విచారణ చేయాలని కోర్టుని ఆశ్రయించారు. ఇలా రెండు పార్టీలు ఎమ్మెల్యే కొనుగోలు కేసు విషయంలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే..ఈ వార్ మరింత ముదరనుంది.

ReplyForward

Read more RELATED
Recommended to you

Latest news