ఈ మాజీ ఎమ్మెల్యే కూడా గోడ దూకేస్తున్నారా…!

-

ఆయనో మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో వైసీపీ నుంచి అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్‌ చేశారు. నియోజకవర్గంలో పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇబ్బందిగా ఉందో ఏమో.. టీడీపీకి ముఖం చాటేస్తున్నారట. కుదిరితే మరోసారి జంప్‌ కొడదామని చూస్తున్నారట.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్నారు. ప్రస్తుతం గిద్దలూరు టీడీపీ ఇంఛార్జ్‌ ఆయనే. అయినా పార్టీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పార్టీ కార్యకర్తలతో కూడా టచ్‌లో లేరట. 2014 ఎన్నికల సమయంలో అశోక్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో నలుగురైదుగురు పోటీపడ్డా జగన్‌ అశోక్‌ వైపు మొగ్గుచూపి సీట్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి.. తక్కువ కాలంలోనే వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. పార్టీలోని ముఖ్య నాయకులను పక్కన పెట్టి ఆయనకి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు జగన్‌. అయితే అశోక్‌ వైసీపీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో చేరిపోయారు.

టీడీపీలో చేరిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో మూడేళ్లపాటు గిద్దలూరులో చక్రం తిప్పారు. టీడీపీ కూడా అశోక్‌రెడ్డికి పెద్ద పీట వేసి.. అప్పటి వరకూ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న అన్నా రాంబాబును సైతం పక్కన పెట్టింది. ఫలితంగా అశోక్‌కు ఎదురే లేకుండా పోయింది. కానీ.. 2019 ఎన్నికలు అశోక్‌రెడ్డికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 2014 ఎన్నికల్లో 13 వేల మెజారిటీతో గెలుపొందితే.. 2019 ఎన్నికల్లో 83వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి రాంబాబు చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి కుంగదీసిందో.. లేక టీడీపీ అధికారంలోకి రాదన్న ఆవేదనో కానీ.. అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం గిద్దలూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నా పార్టీ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్‌ పెట్టడం లేదట. సొంత వ్యాపారాలను చూసుకుంటున్నారట.

టీడీపీలోని ముఖ్య అనుచరులు, నాయకులతో మాత్రమే అశోక్‌ టచ్‌లో ఉన్నట్లు టాక్‌. ఇదే సమయంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు చిక్కి వైసీపీ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారట అశోక్‌రెడ్డి. దీంతో అశోక్‌రెడ్డి కూడా వైసీపీలోకి వెళ్తారా అన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఓసారి అధికార పార్టీలో చేరి.. గత ఎన్నికల్లో దెబ్బతిన్న అశోక్‌రెడ్డి ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news