డ్రగ్ డీలర్ ఎడ్విన్ పై పీడీ యాక్ట్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

డ్రగ్స్ సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న ఎడ్విన్ పై పీడీ చట్టం ప్రయోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎడ్విన్ ను పీడీ చట్టం కింద నిర్బంధించడం చెల్లదని స్పష్టం చేసింది. అతనిపై పీడీ చట్టం ప్రయోగిస్తూ పోలీసులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

బెయిల్‌పైఉన్న ఎడ్విన్‌ను పీడీ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ అతని భార్య అర్పా న్యూన్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టినంది.  పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఎడ్విన్‌పై ఉస్మానియా యూనివర్సిటీ, లాలాగూడ, రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు. 3 కేసులున్న నేపథ్యంలో పోలీసులు పీడీ చట్టం ప్రయోగిస్తూ నిర్బంధంలోకి తీసుకున్నారన్నారు. బెయిల్‌ షరతులను ఉల్లంఘించినట్లు గాని, మరో నేరానికి పాల్పడినట్లు గాని చెప్పకుండా పీడీ చట్టం కింద అక్రమంగా నిర్బంధించారని చెప్పారు.

ప్రభుత్వం తరఫు న్యాయవాది ముజీబ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఎడ్విన్‌ను విడుదల చేస్తే సమాజానికి హాని కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. ఎడ్విన్‌పై పీడీ చట్టం చెల్లదని తీర్పు వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version