ఎంపీ అరవింద్ ను వేల్పూర్ వద్ద అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు..

బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డగించడం తో నడిరోడ్డుపైనే బైఠాయించారు. దీంతో నిజామాబాద్ పరిధిలోని వేల్పూరు క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీసుల తీరు పైన, ఫిర్యాదు చేసినా పట్టించుకోని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ పరిధిలోని కుకునూరు గ్రామాన్ని అరవింద్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.. తనకు వచ్చే ఎంపీ లాడ్స్ తో ఆ గ్రామంలో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు.

ఈ క్రమంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు అరవింద్ తన అనుచరులతో కలిసి బయలుదేరారు. వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఆయనను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఈ విషయం తెలియజేసిన అరవింద్ టిఆర్ఎస్ శ్రేణులను అక్కడినుంచి తరలించాలని కోరారు. అయితే పోలీసుల నుంచి ఎంతసేపటికీ స్పందన రాకపోవడంతో కమిషనర్ వైఖరిని నిరసిస్తూ నేరుగా కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్ళిన అరవింద్ తన అనుచరులతో కలిసి బైఠాయించారు.