ఎడిట్ నోట్ : కొత్త రాష్ట్ర‌ప‌తి ఎవ‌రు ? జ‌గ‌న్ ఎటు వైపు ?

-

3.07 శాతం ఓట్లు ఉన్న జ‌గ‌న్ ఎటువైపు  అని ఇప్పుడంతా ఆస‌క్తిదాయ‌కంగా ఎదురు చూస్తున్నారు. బీజేపీకి అతి పెద్ద పార్టీ అన్న‌పేరు ఉన్నా కూడా రాష్ట్ర‌ప‌తిని గెలిపించేది వైసీపీనే ! క‌నుక కొత్త రాష్ట్ర‌ప‌తి ఎవ‌రు అన్న ఆసక్తి క‌న్నా వైసీపీ ఎవ‌రి వైపు మొగ్గు చూపుతుంది అన్న వాద‌నే ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఏ విష‌యంలోనూ పెద్ద‌గా సాయం చేయ‌ని బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా ఏం చెప్ప‌ద‌ల్చుకున్నార‌న్న డౌట్ కూడా ఇదే స‌మ‌యాన వ‌స్తుంది.
ఓ వైపు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కున్నా, కనీసం ఆ ఊసుకు ప్రాధాన్యం కూడా ఇవ్వ‌క‌పోయినా, ప్ర‌స్తావ‌న‌కు కూడా ఇష్ట‌ప‌డ‌క‌పోయినా జ‌గ‌న్ ఎందుకు మద్ద‌తిస్తున్నారు అన్న‌ది ఆన్స‌ర్ వెత‌కాలి. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ మాత్రం త‌న సొంత దారుల్లో రాష్ట్ర ప‌తి ఎన్నిక‌కు సంబంధించి త‌న త‌ర‌ఫున మ‌రియు త‌న కూట‌మి త‌ర‌ఫున ఓ కొత్త అభ్య‌ర్థిని బీజేపీ కూట‌మికి వ్య‌తిరేకంగా నిల‌బెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. గెలిచినా, గెల‌వ‌కున్నా ఆయ‌న త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నారు.

ఇవిగో పేర్లు :

కొత్త రాష్ట్రప‌తి అయ్యే అవ‌కాశాలున్న వారిలో
ఆరిఫ్ మ‌హ్మ‌ద్  ఖాన్ – కేర‌ళ గ‌వ‌ర్న‌ర్
త‌మిళ సై – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్
వెంక‌య్య నాయుడు – ఉప రాష్ట్ర‌ప‌తి
జ‌గ్దీశ్ ముఖి  – అస్సోం గ‌వ‌ర్న‌ర్
ద్రౌప‌ది ముర్ము – ఝ‌ర్ఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్
అన‌సూయ యూకి – ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్
త‌దిత‌ర పేర్లు ఎన్డీఏ కూట‌మికి సంబంధించి విన‌ప‌డుతున్నాయి.
జూలై 18న జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే క‌స‌రత్తులు మొద‌ల‌య్యాయి. విప‌క్ష కూట‌మి నుంచి శ‌ర‌ద్ ప‌వార్ (ఎన్సీపీ నేత‌) పేరు విన‌ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో గ‌త సారి  రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయినా మాజీ స్పీక‌ర్ మీరా కుమార్ పేరు మ‌రోసారి విన‌ప‌డుతోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ  తన‌ను బ‌రిలో దించుతార‌న్న వార్త‌కు ఎప్పుడో ఖండ‌న ఇచ్చారు శ‌ర‌ద్ ప‌వార్. ఇక ఈ సారి బ‌రిలో ద‌ళిత మ‌హిళ కానీ ఆదివాసీ మ‌హిళ కానీ బీజేపీ రంగంలోకి దించుతుందని ప్ర‌ధాన మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి. ఎస్టీల నుంచి ఒకరిని ఎంపిక చేయాల‌ని అనుకుంటే మాత్రం ద్రౌప‌ది ముర్ము పేరు క‌న్ఫం కావొచ్చు అని కూడా ప్ర‌థాన మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి. ఇక ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డి పోవాల‌ని కల‌లు కంటున్న క‌మ‌ల నాథులు ఆ దిశ‌గా వాటిని నెర‌వేర్చుకునేందుకు ఇక్క‌డి నేత‌ల‌లో ఎవ‌రో ఒక‌రికి ఛాన్స్ ఇస్తే ఇవ్వొచ్చు. మ‌రోవైపు వీళ్లెవ్వ‌రూ కాకుండా ఓ కొత్త వ్య‌క్తికి ఛాన్స్ ఇస్తారు అన్న వాద‌న కూడా ఉంది. ఈ పాటికే అభ్య‌ర్థి క‌న్ఫం అయి ఉన్నాడ‌ని, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి వెళ్లి క‌లిశార‌ని కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news