ఎడిట్ నోట్: ‘బీజేపీ’..బాబు.!

-

గత ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని బి‌జే‌పి మోసం చేస్తుందని..ఆ ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టి‌డి‌పి..పొత్తు నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. పొత్తు నుంచి బయటకొచ్చి మోదీ సర్కార్ పై చంద్రబాబు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. నిరసనలు తెలియజేశారు. ఇక బి‌జే‌పికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలని ఏకం చేసే పని చేశారు. ఆఖరికి కాంగ్రెస్ తో కలిశారు. ఎన్ని చేసిన కేంద్రంలో బి‌జే‌పికి చెక్ పెట్టలేకపోయారు. 2019లో మళ్ళీ బి‌జే‌పి గెలిచి అధికారంలోకి వచ్చింది.

ఇటు రాష్ట్రంలో టి‌డి‌పి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబుకు ఒక్కసారిగా ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇదే క్రమంలో ఆయన ఓడిన దగ్గర నుంచి బి‌జే‌పికి దగ్గరయ్యేందుకు చూస్తూనే ఉన్నారు. కానీ బి‌జే‌పి మాత్రం దగ్గరకు రానివ్వలేదు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ఈ క్రమంలో చంద్రబాబు పొత్తుల గురించి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పవన్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు బి‌జే‌పితో కలిస్తే కేంద్రం మద్ధతు వస్తుందని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన బి‌జే‌పికి అనుకూలంగా గళం విప్పడం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీని పొగుడుతూ మాట్లాడారు.  తనకు రాజకీయాల కంటే కూడా దేశం ముఖ్యమని,  దేశాభివృద్ధి విషయంలో మోదీ విధానాలకు మద్దతిస్తామని, ఆయన దేశాభివృద్ధి దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మద్దతిస్తామని అన్నారు.

ఇక ఎన్డీయేతో తమ పార్టీ రాజకీయంగా కలుస్తుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుందని, గతంలో  ఎన్‌డీఏలో ఉన్నప్పుడు కూడా ప్రధాని మోదీతో తమకు విధానపరమైన విభేదాలేవీ లేవని, ఆయన విధానాలను వ్యతిరేకించలేదని,  రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరామని… అది రాకపోవడం వల్లే బయటకు వచ్చామని గుర్తుచేశారు. అంటే ఇప్పుడు పరోక్షంగా బి‌జే‌పికి దగ్గరవ్వడానికి బాబు చూస్తున్నారని తెలుస్తుంది. అటు బి‌జే‌పి మాత్రం మళ్ళీ టి‌డి‌పితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. ఇటు టి‌డి‌పి నేతలు సైతం ఏపీలో బలం లేని బి‌జే‌పితో పొత్తు వద్దు అని అనుకుంటున్నారు. పైగా ఏపీ ప్రజలు బి‌జే‌పిపై ఆగ్రహంగానే ఉన్నారు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల తమకు ఏమైనా కలిసొస్తుందని బాబు భావిస్తున్నారు. చూడాలి మరి చివరికి బి‌జే‌పితో బాబు కలుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news