ఆర్వీఎమ్ మరోసారి చర్చ జరగాలి : పయ్యావుల కేశవ్‌

-

వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ ను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈసీ అనుసరించిన విధానం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ముందుగా రాజకీయ పార్టీలను సంప్రదించలేదని అన్నారు. పార్టీల అభిప్రాయాలు స్వీకరించకుండానే ఆర్వీఎమ్ తీసుకొచ్చారని పయ్యావుల విమర్శించారు. రాజకీయ పక్షాల ఏకాభిప్రాయం తర్వాతనే ఆర్వీఎమ్ అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఈ రిమోట్ ఓటింగ్ మెషీన్ పై శాస్త్రీయ అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం నడిబొడ్డున స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించగలిగారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల గ్రామంలో సైతం రోడ్ షో చేసే స్వేచ్ఛలేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పార్టీ తరఫున హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ జీవో ఎమర్జెన్సీ నాటి నిషేధాజ్ఞల కంటే దారుణమని అభివర్ణించారు. అప్పట్లో సభలు, సమావేశాలు పెట్టినవారిపై కేసులు పెట్టారని, ఇప్పుడు సభ పెట్టకముందే ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టకముందే కేసులు పెడుతున్నారని పయ్యావుల మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news