ఏపీ ‘రాజకీయ బాధిత’ రాష్ట్రం

-

  • 15వ ఆర్థిక సంఘానికి అన్నీ చెప్పాలి
  • ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచనలు 
అమరావతి, ఆక్టోబరు 5 : ‘ఆంధ్రప్రదేశ్‌ను ఒక రాజకీయ బాధిత రాష్ట్రంగా మార్చారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలిచేస్తున్నారు. ఇదే విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా, సమర్ధవంతంగా 15వ ఆర్థిక సంఘానికి తెలియజెప్పాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ఈనెల 11న జరగనున్న 15వ ఆర్థిక సంఘం సమావేశంలో సభ్యుల ముందు ఏఏ అంశాలను ప్రస్తావించాలనే విషయంపై శుక్రవారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
కేంద్ర రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు నంద్ కిశోర్ సింగ్ అధ్యక్షునిగా వున్న 15వ ఆర్థిక సంఘం ఆర్థిక కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విని వినతులు స్వీకరించేందుకు రాష్ట్రానికి వస్తోంది. ఈ సందర్భంగా జరిగే సమావేశంలో అశాస్త్రీయ రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన వైనాన్ని, ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అందరికీ అర్ధమయ్యేలా కూలంకుశంగా విడమరచి చెప్పాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కొత్త ఆర్థిక సంఘం వైఖరి ఏమిటో గట్టిగా నిలదీయాలని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకు ఇంతకు మించిన సందర్భం మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. ‘నిజానికి నీతిఆయోగ్ డమ్మీగా మారింది, ప్రణాళికా సంఘాన్ని తీసేశారు, నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టరు, ఇక రాష్ట్ర సమస్యల్ని చెప్పడానికి ఒక ఫోరం అంటూ ఏదీ లేదు. ఈ పరిస్థితులలో 15వ ఆర్థిక సంఘాన్ని మించిన వేదిక మనకు దొరకదు అని ముఖ్యమంత్రి అన్నారు.
‘14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుంది. ఇప్పుడీ అంశాన్ని ప్రస్తావించి కొత్తగా వీరేం చెబుతారో తెలుసుకోవాల్సివుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. 1971 జనాభా ప్రాతిపదిక అంశాన్ని మార్చడం, ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్న వైనం, పునర్విభజన చట్టంలో పొందుపరచిన అంశాలనూ, పార్లమెంటులో ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా చేస్తున్న మోసం.. వీటినన్నింటినీ ఎండగట్టేలా మన వాదన ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ముఖ్యంగా కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే నిష్పత్తిని నిర్ణయించటానికి 2011 జనాభా గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘానికి నిర్దేశించడం పట్ల ఈ సమావేశంలో తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తాజా జనగణన ప్రాతిపదికగా కేంద్ర నిధుల పంపిణీ చేసినట్టయితే జనాభా పెరుగుదల నియంత్రణలో విజయం సాధించిన ఏపీ వంటి రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. దీనిపై మన అభ్యంతరాన్ని 15వ ఆర్థిక సంఘానికి స్పష్టంగా తెలియజేయాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 2031 వరకూ 1971 జనాభా గణాంకాలనే ప్రతిపాదికగా తీసుకోవాలన్న రాజ్యాంగ సవరణను ఇష్టానుసారం మార్చిపారేస్తే ఎలా, నిధుల కేటాయింపులోనే కాదు, రేపు పార్లమెంట్ స్థానాల సంఖ్యను నిర్ణయించడంలో కూడా అన్యాయం చేయడానికి వెనకాడరు’ అని ముఖ్యమంత్రి అన్నారు. అభివృద్ధి లక్ష్యాలను అందుకున్న రాష్ట్రాన్ని శిక్షించి, రాజకీయంగా వేధించడమే వీరి పనిగా వున్నదని వ్యాఖ్యానించారు.
‘విభజన నష్టాలతో పాటు అటు రాయలసీమలో కరవు, ఇటు ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుఫాన్ కొత్త రాష్ట్రానికి స్వాగతం చెప్పాయి. గోరుచుట్టుపై ఇది రోకలి పోటులాంటిది. ఈ అంశాన్ని తొలిపేజీలలోనే ప్రముఖంగా ప్రస్తావించాలి అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. విభజన సమస్యల్ని అధిగమించడానికి కొన్ని లక్ష్యాలను ముందు పెట్టుకుని మిషన్‌మోడ్‌తో పనిచేశాం. అన్ని పారామీటర్లలో ఎంతో కష్టపడి ఫలితాలు సాధిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, అన్ని స్థాయిలలో అందరూ విశేషంగా కృషిచేస్తున్నారు. చాలినంత వర్షపాతం లేకపోయినా నదుల అనుసంధానం, జల సంరక్షణ విధానాలతో ఆశించిన వృద్ధిని నమోదు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా సమర్ధంగా ఎదుర్కొన్నాం కానీ, కేంద్రం నుంచి వాటిల్లుతున్న నష్టాలను నివారించలేకపోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news