ఎడిట్ నోట్: కమలానికి ‘గ్లామర్’!

-

రాజకీయాల్లో సినీ గ్లామర్ అనేది కాస్త అడ్వాంటేజ్‌గానే ఉంటుందని చెప్పొచ్చు..సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే కాస్త…పార్టీలకు ఊపు ఉంటుంది. ఈ ఫార్ములాని బీజేపీ బాగా వాడుకుంటుందనే చెప్పాలి…దేశ స్థాయిలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులని పార్టీలోకి తీసుకున్నారు. కేవలం సినిమా వాళ్ళనే కాదు…క్రీడా ప్రముఖులని సైతం బీజేపీలోకి తీసుకున్నారు. ఇక ఈ ఫార్ములాని తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి బీజేపీ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే బీజేపీ…పవన్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే…ఇక తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ…అక్కడ బలోపేతంపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్‌ఎల్ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్‌తో ఇటీవల అమిత్ షా భేటీ అయిన విషయం తెలిసిందే. వీరి భేటీలో ఏ చర్చ నడిచిందో తెలియదు గాని…అలాగే ఎన్టీఆర్‌ బీజేపీకి మద్ధతు ఇస్తారో లేదో తెలియదు గాని…ఆయనతో భేటీ కావడం బీజేపీకి ప్లస్సే.

అలాగే మీడియా దిగ్గజం రామోజీరావుతో సైతం షా భేటీ అయ్యారు. అంతకముందు రాజమౌళి తండ్రి…దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ కూడా ఇచ్చారు. అటు కృష్ణంరాజు బీజేపీలోనే ఉన్నారు..దీని వల్ల ప్రభాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇక జయప్రద సైతం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే…వీరే కాదు…నరేష్, రాజశేఖర్, జీవిత లాంటి వారు బీజేపీలో ఉన్నారు. ఇలా బీజేపీకి పూర్తిగా గ్లామర్ అద్దె ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా నితిన్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు భేటీ కానున్నారని తెలిసింది.

బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పల్గోవడానికి వస్తున్న నడ్డా…నితిన్‌తో భేటీ కానున్నారు. తెలంగాణకు చెందిన నితిన్‌తో పాటు సినీ ప్రముఖులు, రచయితలు నడ్డాను కలుసుకోనున్నారు. అటు మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌తో సైతం భేటీ అవుతారని తెలిసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోన్న కమలనాథులు.. సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. సినీ రంగంలో ఉన్న ప్రముఖులను ప్రచారానికి ఉపయోగించడంతో పాటు ఆసక్తి ఉన్నవారికి టికెట్లు కూడా ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

ఈ విధంగా సినీ ప్రముఖులని బీజేపీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది…అయితే ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా నడుస్తున్న సినీ రంగంలోని ప్రముఖులు చాలా వరకు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు. గతంలో సినీ ప్రముఖులు టీడీపీకి అనుకూలంగా ఉండేవారు. అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది..అటు ఏపీలో కూడా అధికారంలో లేదు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ఏపీలో వైసీపీకి అనుకూలంగా సినీ ప్రముఖులు నడుస్తున్నారు. అయితే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన బీజేపీ…సినీ దిగ్గజాలని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. సినీ గ్లామర్ ద్వారా…రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తుంది. మరి చూడాలి సినీ గ్లామర్ కమలానికి ఎంత ప్లస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news