ఎడిట్ నోట్: కమలంలో ‘కొత్త’ రాజకీయం.!

-

కమలంలో కొత్త రాజకీయం మొదలైంది..మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బి‌జే‌పి..కేంద్ర మంత్రివర్గంతో పాటు..రాష్ట్ర నాయకత్వల్లో భారీ మార్పులు చేసేందుకు రెడీ అవుతుంది. విపక్షాలు ఏకం కావడం, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కమలం కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేయడానికి రెడీ అయిపోయింది. అదే సమయంలో త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో కూడా కీలక మార్పులు చేయడానికి రెడీ అవుతుంది.

ఇదే క్రమంలో తెలంగాణలో నాయకత్వ మార్పుపై బి‌జే‌పి జాతీయ నాయకత్వం తీవ్రంగానే కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది.తెలంగాణకు ప్రస్తుతం బి‌జే‌పి అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉన్నారు. బండి ఆధ్వర్యంలో బి‌జే‌పి మంచి విజయాలు అందుకుంది. పార్టీ బలపడింది. కానీ ఇటీవల కాలంలో బి‌జే‌పి కాస్త వెనుకబడింది..కాంగ్రెస్ దూసుకొచ్చింది. అదే సమయంలో బండికి సొంత పార్టీ నేతలతోనే పడటం లేదు. కొందరు నేతలు బండికి వ్యతిరేకంగా ఉన్నారు. బండి సైతం..కొందరు నేతలని పూర్తిగా కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో..బండిని మార్చడానికి బి‌జే‌పి అధిష్టానం కసరత్తు చేస్తుందట. ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని బండిని కేంద్ర మంత్రివర్గంలోకి గాని, లేదా జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఇచ్చి…తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని నియమించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అటు అసంతృప్తిగా ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు సైతం కీలక పదవులు ఇస్తారని సమాచారం. ఇటు బండికి జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఇస్తే…కేంద్ర మంత్రివర్గంలోకి మిగిలిన ఎంపీల్లో..అరవింద్, సోయం బాపురావు, కే లక్ష్మణ్ ల్లో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక తెలంగాణ నాయకత్వమే కాదు..ఏపీ నాయకత్వంలో కూడా మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. చూడాలి కమలంలో కొత్త మార్పులు ఏ స్థాయిలో ఉంటాయో.

Read more RELATED
Recommended to you

Latest news