సాగర్ లో గెలుపుకు జానారెడ్డి కొత్త ఎత్తులు..కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా

-

నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారింది. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బరిలో ఉన్నా. గెలుపు పై సందేహాలు..ఈ పరిస్థితిని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది జానారెడ్డి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఉప ఎన్నికలు అటు జానారెడ్డికి ఇటు కాంగ్రెస్ పార్టీ చావో రేవో అన్నట్లు మారడంతో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.


సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ప్రధాన బలం ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి. అపార అనుభవం ఉండడంతో పాటు సాంప్రదాయ ఓటు బ్యాంకు, ఏడూ సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఆయన చేసిన అభివృద్ధి, గత ఎన్నికల్లో ఓటమి సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇలా ఎన్నో అంశాలు తమ గెలుపుకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో వరుస ఓటములు ఆ హస్తం పార్టీ బలహీనతగా చెప్పుకోవచ్చు. 1983 నుండి వరుసగా పోటీ చేస్తున్న జానారెడ్డి 1994, 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగిస్తూ వచ్చారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఇన్‌ చార్జ్‌ లతో హీటెక్కించినట్టే, కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. మండలాల వారీగా ఇంచార్జ్‌ లను నియమించింది. ప్రచారం ముగిసేంత వరకు బాధ్యతలు అప్పగించిన చోటునుండి బయటకు వెళ్ళకుండా పని చేయాలని టార్గెట్ పెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నాగార్జున సాగర్ ఎన్నికలు చావో రేవో లాంటి సమస్యగా మారింది. రాజకీయంగా నాగార్జున సాగర్ లో గెలిస్తే, భవిష్యత్ పై ఆశలు పెంచుకోవచ్చు. లేదంటే జానారెడ్డి పోటిలో ఉన్న నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు పడితే రాజకీయంగా ఇబ్బంది తప్పదనే ఫీలింగ్ లో నాయకులు ఉన్నారు. దీంతో సీనియర్ నాయకులంతా సాగర్ లోనే మకాం వేశారు.

టీఆర్ఎస్ ప్రధాన ఓటు బ్యాంక్ గా ఉన్న పెన్షనర్లు,రైతుబంధు ఓటర్ల పై దృష్టి పెట్టింది కాంగ్రెస్. సీనియర్ నేతగా జానారెడ్డిని గుర్తించి ఒక్క చాన్స్ ఇస్తే మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు పెంచుకుంటుందని..ఓటమితో కేసీఆర్ కూడా సామన్యుల పై దృష్టి పెట్టి మరింత మేలు చేస్తారని ప్రచారం చేస్తుంది. అధికార టీఆర్ఎస్ ని గెలిపిస్తే అహంకారం పెరిగి గులాబీ నేతలు సామన్యులను పట్టించుకోరని ఓటర్లను డిఫెన్సులో పడేస్తుంది. మిగిలిన ఇద్దరు అభ్యర్దులతో పోలిస్తే నియోజకవర్గంలో చిన్న పెద్ద అంతరం లేకుండా జానారెడ్డికి ఉన్న పరిచయాలు కూడా కాంగ్రెస్ ని గట్టెక్కిస్తాయని నమ్ముతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ కి సవాల్. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. కానీ ఇప్పుడు అదే రిపీట్‌ అయితే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కి అధికారం సంగతి పక్కన పెడితే పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం లో ఉంది. వీటన్నిటికీ కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఎన్నికల ఫలితంతో సమాధానం చెప్పాలని చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news