రాజధాని రగడ రిపీట్..నష్టం ఎవరికి?

-

ఏ రాష్ట్రంలోనైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏవైనా విధానపరమైన అంశాలపై, లేదా అవినీతి, అక్రమాలపై, పథకాల అమలు తీరుపై…ఇంకా ఇతర అంశాల్లో విమర్శల పర్వం నడుస్తోంది. ఎక్కడా కూడా రాజధాని విషయంలో మాత్రం రచ్చ జరగదు. ఎందుకంటే కొత్తగా రాజధానులు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్తితులు లేవు. పైనున్న అన్నీ రచ్చలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని గురించి కూడా మూడేళ్లుగా రచ్చ నడుస్తోంది.

అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…ఈ రాజధాని అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ ముందుకెళుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు…ఏదో మొక్కుబడిగా అప్పుడు జగన్ మద్ధతు ఇచ్చారు. ఇక చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. గ్రాఫిక్స్‌లు చేసి జనాలని మురిపించారు. ఇక అక్కడ టీడీపీ లెక్కలేనంత అవినీతి, అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తూ…అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చింది.

అమరావతికి ముంపు ఉందని, ఖర్చు ఎక్కువని, అదే అన్నీ రెడీగా ఉన్న విశాఖ అయితే రాజధానిగా బాగుంటుందని జగన్..ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించారు. అయితే మూడు రాజధానులు చెప్పి మూడేళ్లు అయింది…కానీ ఇంతవరకు దారి దిక్కు లేదు. పైగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా కేసులు పడటంతో మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నారు. మళ్ళీ కొత్త బిల్లుతో వస్తామని చెప్పారు. ఎలాగైనా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చెబుతోంది.

ఇటు ఏమో టీడీపీ ఒకే రాజధాని ఉంటుందని, అది అమరావతి అంటుంది…అటు అమరావతి రైతులు మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు. అమరావతి నుంచి శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్లాన్ చేశారు..కానీ దీనికి డీజీపీ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో రైతులు కోర్టుకు వెళ్లారు. ఇలా రాజధాని విషయంలో ఎప్పుడు ఏదొక రగడ నడుస్తూనే ఉంది…దీని వల్ల రాజకీయ పార్టీలకు రాజకీయ లబ్ది వస్తుందేమో గాని…చివరికి నష్టపోయేది మాత్రం ప్రజలే. ఇప్పటికే బయట రాష్ట్రం వాళ్ళు..మీ రాజధాని ఏది అంటే ఏపీ ప్రజలు సమాధానం చెప్పలేని పరిస్తితిలో ఉన్నారు. అలాంటి పరిస్తితుల్లో ఏపీ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news